మంత్రి తుమ్మల విశేష కృషి… గిరిజన ప్రాంతంలో విద్యాజ్యోతి
– అంతర్జాతీయ ప్రమాణాలతో స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల
– ఏళ్ల నాటి కల సాకారం
– రఘునాథపాలెంలో 13 ఎకరాల్లో గురుకుల్ పాఠశాల
– 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన
– లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులు
– నిరుపేద విద్యార్థులకు 10 శాతం ఉచిత సీట్లు
– నేడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా భూమిపూజ, శంకుస్థాపన
ఖమ్మం: ఆగస్టు 25 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

గిరిజన ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మరింత పెంచడంతో పాటు, ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు సైతం నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించే దిశగా మరో కీలక అడుగు పడుతోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండా పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్వామినారాయణ గురుకుల్ పాఠశాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటు కార్యరూపం దాల్చింది. పాఠశాల నిర్మాణానికి నేడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమిపూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు.
13.10 ఎకరాల్లో స్వామినారాయణ గురుకులం..
రఘునాథపాలెం రెవెన్యూ పరిధిలో పాఠశాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించాలని హైదరాబాద్కు చెందిన శ్రీ స్వామినారాయణ గురుకుల్ నిర్వాహక సంస్థ తరఫున సాధు శుక్వల్లభాస్ చేసిన విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. తొమ్మిది సర్వే నంబర్లలో మొత్తం 13 ఎకరాల 10½ గుంటల భూమిని పాఠశాల ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించింది.
ఎకరాకు రూ.11.25 లక్షల మార్కెట్ విలువను సిఫారసు చేస్తూ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర భూ నిర్వహణ ప్రాధికార సంస్థ (టీజీఎల్ఎంఏ) పరిశీలించి ఆమోదించింది. అనంతరం ప్రభుత్వం రెవెన్యూ (భూ నిర్వహణ-I) శాఖ ద్వారా జి.ఓ.ఎం.ఎస్.నం.71, తేదీ 09-08-2024ను జారీ చేసింది. ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో జారీ చేసిన ఈ ఉత్తర్వులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ సంతకం చేశారు.
1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్య..
స్వామినారాయణ గురుకుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన అందించనున్నారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పాఠశాల భవనాలు, విద్యార్థులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలతో క్యాంపస్ రూపుదిద్దుకోనుంది.
విద్యతో పాటు మానవతా విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా విద్యాబోధన సాగనుంది. ఆధునిక విద్యతో పాటు భారతీయ విలువలను విద్యార్థుల్లో పెంపొందించేలా గురుకుల్ విద్యా విధానం ఉండనుంది.
తెలంగాణలో స్వామినారాయణ గురుకుల్కు ఇది 4వ విద్యాసంస్థ…
స్వామినారాయణ గురుకుల్ విద్యాసంస్థలు ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విద్యను అందిస్తున్నాయి. జింకలతండాలో ఏర్పాటు కానున్న ఈ గురుకుల్ పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో స్వామినారాయణ గురుకుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న 4వ విద్యాసంస్థగా నిలవనుంది. రాష్ట్రంలో ఇప్పటికే హైదరాబాద్/చేవెళ్ల, జడ్చర్ల, సూర్యాపేట ప్రాంతాల్లో స్వామినారాయణ గురుకుల్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ పాఠశాలతో రాష్ట్రంలో గురుకుల్ విద్యా సంస్థల సంఖ్య నాలుగుకు చేరనుంది.
జింకలతండాలో ఏర్పాటు కానున్న గురుకుల్ పాఠశాల కూడా రాష్ట్రంలోని ప్రముఖ గురుకుల్ విద్యాసంస్థల సరసన నిలవనుంది. ఖమ్మం జిల్లాలో ఇలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటవడం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ప్రజలతో పాటు పొరుగు జిల్లాల విద్యార్థులకు కూడా ఈ పాఠశాల నాణ్యమైన విద్యకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారనుంది.
నిరుపేద పిల్లలకు 10 శాతం ఉచిత సీట్లు..
పాఠశాలకు భూమిని కేటాయించే సమయంలో ప్రభుత్వం ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక షరతును విధించింది. జి.ఓ.ఎం.ఎస్.నం.571 (2012) నిబంధనల ప్రకారం పాఠశాలలో అందుబాటులో ఉండే సీట్లలో 10 శాతం సీట్లను ఎలాంటి ఫీజు లేకుండా నిరుపేద విద్యార్థులకు కేటాయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్కు అప్పగించారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పొందే అవకాశం లభించనుంది. బీఎస్ఓ-23 ప్రకారం భూమి కేటాయింపు, బీఎస్ఓ-24 ప్రకారం వినియోగానికి సంబంధించిన సాధారణ షరతులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
నేడు మంత్రి తుమ్మల చేతుల మీదుగా శంకుస్థాపన..
ప్రభుత్వ అనుమతులతో పాఠశాల ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో జింకలతండా ప్రాంతంలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించనున్న కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలతో పాటు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఈ విద్యాసంస్థ ఏర్పాటు జరుగుతోందని పేర్కొననున్నారు. ఆధునిక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మానవతా విలువలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని, స్వామినారాయణ గురుకుల్ విద్యా విధానం ఈ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని మంత్రి చెప్పనున్నారు.. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, గురుకుల నిర్వాహక ప్రతినిధులు పాల్గొననున్నారు.
గిరిజన ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త బాట..
విద్య అనేది కేవలం ఉద్యోగ అవకాశాలకు మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమాజ నిర్మాణానికి, విలువల పరిరక్షణకు దోహదపడాలని భావించే గురుకుల్ విద్యా విధానం ఖమ్మం జిల్లాకు రావడం ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఏళ్ల నాటి ఆకాంక్ష సాకారం కావడంతో, జింకలతండాలో ఏర్పాటు కానున్న స్వామినారాయణ గురుకుల్ భవిష్యత్తులో ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం, చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, సంస్కృతి, సంప్రదాయాలు, మానవతా విలువలను అందించే ప్రతిష్టాత్మక విద్యా కేంద్రంగా నిలవనుంది.





