ఖమ్మం జూన్ 8 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు
భావితరాలకు ఉపయోగపడేలా గ్రామాభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి.. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు
రూ.97 లక్షల సుడా నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన పశు వైద్యశాల భవనం ప్రారంభం
రఘునాథపాలెం మండలం వి.వి.పాలెంలో పర్యటించిన మంత్రి తుమ్మల
రఘునాథపాలెం, జూన్ 8:
భావితరాలకు ఉపయోగపడేలా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను అత్యుత్తమ నాణ్యతతో అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
సోమవారం రఘునాథపాలెం మండలం వి.వి.పాలెం గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి రూ.97 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వి.వి.పాలెం గ్రామంతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని తెలిపారు. 1982లో దివంగత ఎన్టీఆర్తో కలిసి తొలిసారిగా ఈ గ్రామానికి వచ్చినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ కాలంలో ఎత్తిపోతల పనులు చేపట్టామని, అనంతరం ప్రతి ప్రభుత్వ హయాంలోనూ గ్రామ అభివృద్ధికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే గ్రామాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పశు వైద్యశాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని ఆర్డీవోను ఆదేశించినట్లు చెప్పారు. పేదల్లో అత్యంత పేదలకు గృహ స్థలాలు అందించేందుకు అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ మండల ఉపకేంద్ర స్థాయి లో పశు వైద్యశాల భవనం వి.వి.పాలెంలో నిర్మించడం ఈ ప్రాంత ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పశు సంపద రైతులకు ఆర్థిక బలాన్ని అందిస్తుందని, పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని తెలిపారు.
జిల్లా పశు వైద్యశాలకు పరిసర ఐదు, ఆరు జిల్లాల్లో మంచి గుర్తింపు ఉందని, కొన్ని మరమ్మతుల కోసం ప్రతిపాదనలు అవసరమని తెలిపారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు భూమి వినియోగం సమర్థవంతంగా ఉండాలని సూచించారు. పాఠశాలల కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాల్లో లేదా వినియోగంలో లేని ప్రభుత్వ భవనాలను మరమ్మతులు చేసి ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్, వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్, తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ కాపా ఆదినారాయణ, ఉప సర్పంచ్ గుగులోతు ప్రవీణ్ నాయక్, ఆత్మ చైర్మన్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.









