ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌళిక సదుపాయాలు
- తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన కార్యాలయం ఉపయోగపడుతుంది
- కూసుమంచి మండల కేంద్రంలో ఈఆర్వో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి
కూసుమంచి జూన్ 8 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు
ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
సోమవారం కూసుమంచి మండల కేంద్రంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌళిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రతి వినియోగదారునికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
నూతనంగా నిర్మించిన ఈఆర్వో కార్యాలయం ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని, విద్యుత్కు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యాలయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస చారి, సంబంధిత శాఖల అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







